- రాష్ట్రంలో క్వింటాల్కు రూ.౫౦౦ ప్రోత్సాహం
- మహారాష్ట్ర నుంచి అక్రమంగా ధాన్యం సరఫరా
- అడ్డదారిలో అక్రమార్జనకు ప్రయత్నాలు
- చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రైతాం గాన్ని ఆదుకునేందుకు సన్న రకం వడ్లకు క్విం టాల్కు రూ.500 బోనస్ ప్రకటించడంతో అక్రమార్కులు అడ్డదారులు తొక్కు తున్నారు.
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో వడ్లను కొనుగోలు చేసి, రాష్ట్రంలో విక్రయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇ ప్పటికే వ్యాన్లు, లారీల్లో ధాన్యాన్ని రోడ్డు మా ర్గాన తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు.
రైస్ మిల్లర్ల భాగస్వామ్యం?
మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ధాన్యం సరఫరా చేయడంలో ఈ ప్రాంతంలోని రైస్ మిల్లు యాజమానుల భాగస్వామ్యం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి నుంచి తరలించిన ధాన్యాన్ని ఇక్కడి రైతుల పేరిట అమ్మకాలు జరిపేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రత్యేకంగా దళారులను ఏర్పాటు చేసి వారి ద్వారా మహారాష్ట్రలో ధాన్యాన్ని కొనుగోలు చేసి సరిహద్దు జిల్లాలు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలతోపాటు పెద్దపల్లి తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.
అక్రమ రవాణాపై నిఘా కరువు
ధాన్యం అక్రమ రవాణపై పౌరసరఫరాల శాఖ అధికారుల నిఘా వైఫల్యంతో అక్రమార్కుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది. జిల్లాలోని వాంకిడి, గూడెం, హుడ్కోలి, వెంకటపూర్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకుంటున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం రవాణా అరికట్టడంలో విఫలం అవుతున్నారన్న ఆరోపణలువినిపిస్తున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నలలో నడుస్తుందని విమర్శలు వస్తున్నాయి.
దళారుల అవతారమెత్తిన వ్యాపారులు
2024-25 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం సాధారణ రకం ధాన్యానికి రూ.2,300, గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.2,320 మద్దతు ధర ప్రకటించింది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించడంతో కొంత మంది వ్యాపారులు దళారుల అవతారం ఎత్తా రు. ఇక్కడి వ్యాపారులకు మహారాష్ట్రలోని వ్యాపారులతో ఉన్న సత్సంబంధాలతో అక్కడ కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తూ లాభాలు ఆర్జించాలని పన్నాగం పన్నా రు.
మహారాష్ట్ర ధాన్యం మన రాష్ట్రంలో అమ్మడంతో ఇక్కడి రైతులకు, ప్రభుత్వానికి నష్టం జరి గే అవకాశం ఉంది. ఈ నెల 27న చింతలామానేపల్లి పోలీసులు మహారాష్ట్ర సరిహద్దులోని గూడెం చెక్పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా 80 క్వింటాళ్ల ధాన్యాన్ని మహారాష్ట్ర నుంచి తీసుకువస్తున్న వ్యాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిరంతం తనిఖీలు చేపడుతున్నాం
సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి మండలంలోని గూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు నిత్యం తనిఖీలు చేస్తున్నాం. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వైపు వచ్చే వాహ నాలు, ఇక్కడి నుంచి అటు వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపడుతున్నాం. మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో నిఘా పెంచాం. మహారాష్ట్ర నుంచి ధాన్యం రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. రెండు రోజుల క్రితం లభ్యమైన 80 క్వింటాల్ల ధాన్యం, వాహనాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించాం.
-ఇస్లావత్ నరేశ్, ఎస్సై,
చింతలామానేపల్లి
అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు
మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు ధాన్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు. తెలంగాణ సరిహద్దు ప్రాంతా లు గూడెం, వాంకిడి, వెంకటపూర్, హు డ్కోలి గ్రామాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశాం.ధాన్యం రవాణపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఇప్పటికే అక్రమ రవాణాపై అధికారులను అలెర్ట్ చేశాం.
దాసరి వేణు, అదనపు కలెక్టర్
(రెవెన్యూ), ఆసిఫాబాద్