calender_icon.png 1 March, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్ ఫ్రైడే

01-03-2025 12:36:07 AM

  1. భారీ నష్టాల్లో సూచీలు
  2. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనం
  3. 2 శాతం నష్టపోయిన నిఫ్టీ
  4. రూ.10 లక్షల మదుపరుల సంపద ఆవిరి

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, బ్యాం కింగ్, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,200 దిగువకు చేరింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఆసియా మార్కెట్లలో సియోల్, టో క్యో, షాంఘై, హాంకాంగ్ షేర్లూ భారీ నష్టాల్లో ముగిశాయి. మదుపర్ల సంపద దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 384 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,201.77 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది.

ఇంట్రాడేలో 73,141. 27 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ.. చివరికి 1414.33 పాయింట్ల నష్టంతో 73,198. 10 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 420.35 పాయింట్లు అంటే దాదాపు 1.9 శతాం నష్టంతో 22,124.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 33 పైసలు కోల్పోయి 87.51 వద్ద ముగిసింది.

సెన్సె క్స్ 30 సూచీలో హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టా ల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా నష్టపోయాయి.

బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2874 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఫిబ్రవరిలో సెన్సెక్స్ 4,303 పాయింట్లు క్షీణించింది. మరో వైపు నిఫ్టీ సైతం ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి జీవిత కాల గరిష్ఠ స్థాయి 26, 277 పాయింట్లనుంచి 16 శాతానికి చేరువైంది. 

నష్టాలకు కారణాలు 

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటినుంచి స్టాక్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగు తోంది. ఎప్పటికప్పుడు ట్రంప్ చేస్తున్న టారిఫ్ ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయా లు రేపుతున్నాయి. మెక్సికో, కెనడాపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

తాజాగా చైనాపై అదనంగా మరో 10 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. చైనాపై సుంకాలూ అదేరోజు నుంచి అమలవుతాయని పేర్కొన్నారు. ఈయూపైనా 25 శాతం సుంకాలు వేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనలు మదుపర్లలో ఆందోళనకు కారణమ ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.