బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
ముషీరాబాద్, అక్టోబర్ 26: బీసీ కులగణనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ వైఖరిని వెల్లడించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణలోనే తరహాలోనే దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని అన్నారు.
ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేషాచారి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బీసీ కులగణన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు హామీని పూర్తిగా విస్మరించిందన్నారు.
బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని, లేనిపక్షంలో త్వరలో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బీసీ కులగణన చేపట్టాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలనే ప్రధాన డిమాండ్తో డిసెంబర్ 5, 6 తేదీల్లో వేలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి ఎర్రకోటను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన తొడుపునూరు కృష్ణగౌడ్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, హైదరాబాద్కు చెందిన పండ్ల మనోజ్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.