26-02-2025 01:14:11 AM
ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : రాష్ర్టంలో జరుగుతున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ సీనియర్ నేత అరిగెల నాగేశ్వరరావు నివాసంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలంతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంచిర్యాలలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థి ఓటమి చెందిన నష్టమేమి లేదని చెప్పడం చూస్తే ఓటమిని అంగీకరించారని తెలుస్తుంది అన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలలో ఎమ్మెల్సీ పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకులు ముందుకు రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ సమస్యలు తీర్చడంలో అలసత్వం వహించడంతోపాటు హామీలను విస్మరించిందని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారు మేధావి వర్గానికి చెందిన వారు అన్ని ఆలోచించి శాసనమండలిలో గొంతెత్తి పోరాటం చేసే వారిని గెలిపించుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత కల్పించాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమురయ్యకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో కోట్నాక విజయ్, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు పెంటయ్య, నాయకులు ప్రసాద్ గౌడ్ ,మురళి గౌడ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.