22-03-2025 01:47:07 PM
హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Tamil Nadu Chief Minister Stalin) అధ్యక్షతన డీలిమిటేషన్ పై పార్టీలకతీతంగా అఖిలపక్ష సమావేశం చెన్నైలో జరిగింది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధించామన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించామని తెలిపారు. మౌలిక సౌకర్యాల కల్పన, ఉపాధి కల్పనలో వృద్ధి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. సుపరిపాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తక్కువ మొత్తం పొందుతున్నామని సీఎం ఆరోపించారు. తమిళనాడులో రుపాయి చెల్లిస్తే కేవలం 26 పైసలు పొందుతోందని రేవంత్ తెలిపారు. కర్నాటకలో రూపాయికి 16 పైసలు, తెలంగాణ 42 పైసలు, కేరళ 49 పైసలు పొందుతోందన్నారు. బిహార్ మాత్రం రూపాయికి ఆరు రూపాయల 6 పైసలు పొందుతోందని సీఎం విమర్శించారు. యూపీ రుపాయికి రూ. 2.03, మధ్యప్రదేశ్ రూ. 1.73 పొందుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాణిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు విఘాతం కలుగుతోందని హెచ్చరించారు. పారదర్శకంగా లేని డీలిమిటేషన్ పై బీజేపీని(Bharatiya Janata Party) కట్టడి చేయాల్సిఉందని తెలిపారు. లోక్ సభ సీట్లు పెంచవద్దు.. రాష్ట్రాల్లో అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. 1976 లో లోక్ సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేపట్టారని సీఎం గుర్తుచేశారు. డీలిమిటేషన్.. రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకువస్తుందని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా లోక్ సభ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్ చేపట్టాలని కోరారు. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవన్నారు.
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాజకీయ వాణి కోల్పోతోందన్నారు. దక్షిణాదిని సెకండరీ సిటిజన్లుగా ఉత్తరాది మారుస్తోందని ధ్వజమెత్తారు. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ ను ఒప్పుకునేది లేదని భేటీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్... మిగతా రాష్ట్రాలపై ఆధిపత్య చలాయిస్తాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై మనందరిని ఏకతాటిపై తెచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్కు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. పునర్విభజనపై మనం అభిప్రాయాలను పంచుకోవాలి.. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నా.. ఇక్కడ నా అభిప్రాయాలను మీతో పంచుకుంటున్నా... ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ను ఎదుర్కొంటోంది. బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.