calender_icon.png 19 October, 2024 | 2:04 PM

మోదీ పాలన.. బాంబుల మోతలేని పాలన

19-10-2024 11:48:37 AM

హైదరాబాద్: ఓట్ల కోసం సీట్ల కోసం ఉన్మాదులను పెంచి పోషిస్తే.. పాముకు పాలు పోసి పెంచుకున్నట్టే అని ఇక్కడ పాలకులు మర్చిపోవద్దని ఈటల రాజేందర్ అన్నారు. పివిఎన్ కాలనీ, 139 డివిజన్, ఈస్ట్ ఆనంద్ బాగ్ లో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈటల మాట్లాడుతూ.. మోదీ పాలనలో 11 వ ఏడాదిలోకి వచ్చినం అన్నారు. బాంబుల మోతలేని పాలన, శాంతిని నెలకొల్పారని తెలిపారు. భారతదేశం సురక్షితంగా, సుభిక్షంగా ఉందన్నారు. కానీ దాన్ని దెబ్బతీయడానికి హైదరాబాద్లో అశాంతిని నెలకొల్పడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగమే మన దేవాలయాల మీద దాడులు ఉన్మాదానికి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదన్నారు.

మానవత్వం ఉండదు, అమాయకులు బలి అవుతారు, అనేక దేశాల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తోందని ఈ ఉన్మాదమేనన్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా దీనికి అడ్డుకట్ట వేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావలసి వస్తుందని హెచ్చరించారు. దేశం సురక్షితంగా ఉంచడమే మోదీ కర్తవ్యం, మీరందరూ బిజెపిలో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు.