27-02-2025 11:27:56 PM
కుంభమేళాకు వెళ్లకపోవడంపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులు
ఉద్ధవ్ ఠాక్రేపై కూడా విమర్శలు
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, “ఇండియా”కూటమి నేత ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ పవిత్రమైన మహాకుంభమేళాకు హాజరుకాకపోవడాన్ని తప్పుబడుతున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘ఈ ఇద్దరు నేతలు తాము హిందుత్వవాదులం అని చెప్పకుంటారుగా? కానీ వారు మహాకుంభమేళాకే వెళ్లలేదు. వారి వ్యాఖ్యలకు వారు చేస్తున్నదానికి పొంతన లేదు. 65 కోట్ల మందికి పైగా హిందువులు అక్కడికి వెళ్లారు. కానీ వారు వెళ్లలేదు’. అని విమర్శించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా వీరిపై విమర్శలు గుప్పించారు. ‘ఠాక్రే ప్రస్తుతం వీర్ సావర్కర్ ప్రత్యర్థులతో కలిసి నడుస్తున్నారు’. అని అన్నారు. మరో కేంద్ర మంత్రి అథవాలే కూడా ఈ ఇద్దరు నేతల తీరును తప్పబట్టారు.
మేళాతో రాజకీయాలేంటి?
బీజేపీ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ.. ‘గాంధీ కుటుంబం తరఫున కుంభమేళాకు నేను హాజరయ్యాను. మేళా విషయంలో రాజకీయాలొద్దు. కాంగ్రెస్ కుటుంబం తరఫున నేను మేళాకు హాజరై.. పుణ్యస్నానం ఆచరించా. కుంభ్ రాజకీయాల కోసం కాదు’. అని ఆయన అన్నారు.