రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, మే 3 (విజయక్రాంతి): రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని, దీనిలో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్లో శుక్రవారం నగర మేయర్ నీరజ కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అన్నివర్గాలకు సమప్రాధాన్యం ఇచ్చారన్నారు. అలాగే ప్రధానిగా రాజీవ్ గాంధీ ఆధునిక సాంకేతికతను భారత్కు ఆహ్వానించారని గుర్తుచేశారు.
కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. ఆయన దక్షిణ భారతంపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ లాలూచీ పడి చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డిని మంచి మెజారిటీ తో గెలిపించుకోవాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఖమ్మాన్ని భూకబ్జాలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.