calender_icon.png 24 October, 2024 | 11:48 AM

పుట్టిన రోజే కానరాని లోకాలకు

17-09-2024 03:51:17 AM

కెనడాలో మీర్‌పేట్‌కు చెందిన యువకుడు మృతి 

మహేశ్వరం, సెప్టెంబర్ 16: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ ఓల్డ్ బాలాజీ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత విద్యాభాస్యం కోసం కెనడా వెళ్లిన యువకుడు పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలిలా ఉన్నాయి.. మీర్‌పేట్ ఓల్డ్ బాలాజీ నగర్‌కు చెందిన అడప రవికుమార్, సునీత దంపతులకు ఇద్దరు కుమారురు. వారిలో చిన్నవాడైన ప్రణీత్ (27) 2019లో పీజీ విద్యాభ్యాసం కోసం కెనడా దేశం వెళ్లాడు. 2022లో పెద్ద కుమారుడు ప్రణయ్ కూడా విద్యాభ్యాసం కోసం అక్కడకు వెళ్లాడు. ఇద్దరు కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు.

కాగా, ఈ నెల 15న ప్రణీత్ పుట్టినరోజు కావడంతో సోదరుడు ప్రణయ్, ఇంటి యజమాని, మరో నలుగురు స్నేహితులు కలిసి టొరంటోలో చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో బోటింగ్ చేసి తిరిగి వస్తుండగా ప్రణీత్ బోట్‌లో రాకుండా చెరువులో ఈదుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. చెరువు నుంచి బయటకు వచ్చిన ప్రణయ్‌కి ప్రణీత్ కనిపించకపోవడంతో చెరువులో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చేపట్టి 16న ఉదయం ప్రణీత్ మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కుమారుడి మృతదేహాన్ని కెనడా నుంచి వీలైనంత త్వరగా తీసుకొచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.