12-03-2025 01:13:30 AM
వర్గల్ మండలం మజీద్పల్లిలో 8 వేలకుపైగా కోళ్ల మృతి
పరిశీలించి ధ్రువీకరించిన వెటర్నరీ వైద్యులు
గజ్వేల్, మార్చి 11 : సిద్దిపేట జిల్లాలో మంగళవారం బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫామ్ లో 8000 పైగా కోళ్లు మృతి చెందాయి. కోళ్ల ఫారం నిర్వహిస్తున్న పౌల్ట్రీ రైతు ఎస్.కె అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌల్ట్రీ ఫారం ను లీజుకు తీసుకొని 10వేల కోళ్లను పెంచుతున్నానని చెప్పాడు. 21 రోజుల నుండి కోళ్లు మెల్లిమెల్లిగా అనారోగ్యం బారిన పడుతున్నాయని గడచిన రెండు రోజుల్లోనే 8000 పైగా కోళ్లు మృతి చెందాయన్నారు. వెటర్నరీ వైద్యులు కోళ్లను పరిశీలించి బర్డ్ ఫ్లూ గా నిర్ధారించారని చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగిలిన కోళ్లు కూడా మృతి చెందుతాయన్నారు. కోడి పిల్లలను అందించిన కంపెనీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వమని చెప్పారని, ప్రభుత్వమే ఆదుకొని తనకు సహాయం అందించాలని ఆలీ కోరారు.