calender_icon.png 24 March, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండ్రాంపల్లిలో బర్డ్‌ఫ్లూ కలకలం

23-03-2025 01:23:51 AM

  1. కోళ్లఫారంలోని 2 లక్షల కోళ్ల పూడ్చివేత
  2. కిలోమీటర్ వరకు రెడ్‌జోన్‌గా ప్రకటన
  3. నాటుకోళ్లను సైతం చంపేయాలని నిర్ణయం
  4. వైరస్ వ్యాపించకుండా పశుసంవర్ధక శాఖ చర్యలు

నల్లగొండ, మార్చి 22 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపిం ది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులోని వీఎస్కే ఫౌల్ట్రీఫాంలోని కోళ్లకు (ఏవి యన్ ఇన్‌ఫ్లూఎంజాహెచ్5ఎన్1) వైరస్ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ నెల 17 నుంచి తన కోళ్లఫారంలో నిత్యం 500 నుంచి వెయ్యి కోళ్లవరకు మృత్యువాత పడుతున్నాయని కోళ్లఫారం యజమాని వంగోటి బాలకృష్ణారెడ్డి మండల పశువైద్యాధికారులకు సమా చారం అందించాడు.

పశువైద్యాధికారులు వచ్చి మృత్యువాతపడిన కోళ్లను పరిశీలించి వాటిలో ఐదు కోళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని వెటర్నరీ బయాలాజికల్ రీ సెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు. అక్కడ వాటి ని పరీక్షించిన వైద్య నిపుణులు బర్‌డఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారించినట్లు నల్లగొండ పశుసంవర్థక శాఖ జేడీ రమేశ్ తెలిపారు.

దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవా రం, శనివారం అధికారులు 52 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలుగా ఏర్పడి కోళ్లఫారంలోని 2 లక్షల కోళ్లను సమీపంలో గుంతతీసి పూడ్చిపెట్టారు. కోళ్లఫారం పరిసరాల్లోని కిలోమీటరు వరకు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.

బాయిలర్ కోళ్లతోపాటుగా నాటు కోళ్లను సైతం చంపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కోళ్లఫారాలను నిర్వహిస్తున్న రైతులు ఎప్పటికప్పుడు షెడ్లు, వచ్చిపోయే వాహనాలను శానిటైజేషన్ చేసుకోవాలని సూచించారు.