21-02-2025 01:00:09 AM
వనపర్తి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): జిల్లాలోని మదనాపురం మండలంలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడిన నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి మదనాపురం మండల పరిధిలోని కొన్నూరు శివారులోని పౌల్ట్రీ ఫామ్ ను పరిశీలించారు. కోళ్ళు ఏ విధంగా మృత్యువాత పడ్డాయి అనే విషయంపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని, సంబంధిత కోళ్ల ఫారం యజమానిని ఆరా తీశారు.
ఇటీవల బయటకి ఏమైనా కోళ్లు అమ్మారా అని ప్రశ్నించగా, ఎవరికి అమ్మలేదని చనిపోయిన వాటన్నిటినీ ఫామ్ సమీపంలోనే పూడ్చి వేసినట్లు యజమాని బదులిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్నూరు గ్రామంలో గాని, సమీపంలో ఉన్న చికెన్ దుకాణాలను తెరవనీయ వద్దని, ఎవరైనా అమ్మకాలు జరిపితే వెంటనే బైండోవర్ చేసి, చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ కు ఆదేశించారు. ఎవరూ చికెన్ అమ్మడానికి వీల్లేదని ఆదేశించారు. సమీపంలోని ఇతర పౌల్ట్రీ ఫారం లను సైతం పశుసంవర్ధక శాఖ అధికారులు సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు.
ఏదైనా ఫామ్ లో కోళ్లకు అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే స్టాక్ బయటికి వెళ్లకుండా ఆపివేయాలని ఆదేశించారు. కొన్నూరు సంఘటనపై శాంపిల్స్ విబిఆర్ఐ కి పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కారణాలు ఏంటి అనే వివరాలు తెలుస్తాయని చెప్పారు. కొన్నూరు పౌల్ట్రీ ఫార్మ్ ఘటనపై కోడి పిల్లలు సరఫరా చేసిన సంబంధిత కంపెనీ ప్రతినిధులను పిలిపించి విచారణ చేయడం జరుగుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కొన్నూరు గ్రామంలో పర్యటించి చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. చికెన్ అమ్మడానికి వీల్లేదని దుకాణదారులకు తెలియజేయాలని సూచించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, తహసిల్దార్ అబ్రహం లింకన్, ఎంపీడీవో, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.