calender_icon.png 15 October, 2024 | 3:43 AM

మున్సిపల్ కేంద్రంగా బిచ్కుంద!

15-10-2024 12:04:45 AM

  1. ప్రతిపాదనలు పంపిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ 
  2. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కృషి

కామారెడ్డి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మరో మున్సిపల్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందను మున్సిపాలిటీగా మార్చాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కృషి చేస్తున్నారు.

అందుకు సంబంధించి ప్రణాళికల ను తయారు చేయించి కలెక్టర్ ఆశిష్ సం గ్వాన్ ద్వారా ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. త్వరలోనే బిచ్కుందను మున్సిపల్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించే అవకా శాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం బిచ్కుంద పట్టణ జనాభా 13,213 ఉండగా ప్రస్తుతం 17,480గా  ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

15 వేలకు మించి జనాభా ఉండటంతో మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీగా ఉన్న బిచ్కుంద ఆదాయ, వ్యయాల పరిశీలనకు పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ప్రత్యేక బృందం త్వరలో పర్యటించనుంది. మండల కేంద్రంలోని వసతులు, ఇతర సౌకర్యాలు, ఆదాయ పెంపునకు ఉన్న మార్గాలను పరిశీలిస్తారు.

గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే హన్మంత్‌షిండే చొరవతో బిచ్కుంద, పిట్లం పంచాయ తీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు చేశారు. జిల్లా  యంత్రాంగం బిచ్కుందను మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రభుత్వానికి నివేదించింది.

పట్టణాభివృద్ధి శాఖకు చెందిన అధికారులు సైతం పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ప్రస్తుతం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సూచనలతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆమోదముద్ర వేసి నివేదికను ప్రభుత్వానికి పంపగా పట్టణాభివృద్ధి శాఖకు చేరింది.