calender_icon.png 15 October, 2024 | 5:48 AM

నేడు రాడార్ స్టేషన్‌కు భూమిపూజ

15-10-2024 12:57:11 AM

హాజరుకానున్న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి  

వికారాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాకు రానున్నారు. పరిగి నియోజకవర్గం పూడూరు మండల పరిధిలోని దామగుండం అటవీ ప్రాంతంలో కేం ద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు భూమిపూజ చేయనున్నారు.

రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పలుమార్లు జిల్లాకు వచ్చినా కేవలం సొంత నియోజకవర్గం కొ డంగల్‌కు మాత్రమే వెళ్లారు. మొదటిసారి పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల సరిహద్దులను కలిపి ఉన్న దామగుండం రాను న్నారు. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజలు అభివృద్ధిపై ఆశలు పెంచుకున్నారు.

కొడంగల్ నియోజకవర్గానికి రూ.5 వేల కో ట్లు ప్రకటించి అభివృద్ధి దిశగా తీసుకుపోతుండటంతో, జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలకు కూడా అదే స్థాయిలో నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధి మొత్తం కొడంగల్ నియోజకవర్గానికే పరిమితమైందనే విమర్శల నేపథ్యంలో సీఎం జిల్లా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. 

రాడార్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వ సహకారం

రంగారెడ్డి జిల్లా పూడూర్‌లో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్రానికి సహకరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాం లోనే ఏర్పాటుకు ఆమోదం లభించింది. దామగూడెం రిజర్వు ఫారెస్ట్ లోని 2,900 ఎకరాలను నేవీకి బదిలీ చేస్తూ  డిసెంబర్ 2017న జీవో నంబర్ 44 జారీ చేసిందని, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి ఆ బీఆర్‌ఎస్ ఆ ప్రాజెక్టును వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును ముందు వ్యతిరేకించి, తర్వాత రాజకీయం చేయడం కుసంస్కారమని మండిపడుతున్నది.