30-04-2025 12:45:03 AM
ఎమ్మెల్యే వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి). ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోని రైతు వేదికలో భూభారతి పోర్టల్ అమలులో భాగంగా భూభారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిదన్నారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారని, నేడు కోర్టులను ఆశ్రయించాల్సిన పనిలేద న్నారు. భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా మెయింటెన్ చేస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డుల ను తీసి ఆ ఫైళ్లను తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరు స్తామన్నారు.
ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సైతం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. భూమికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లవచ్చని, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడ కూడా న్యాయం జరక్కపోతే కలెక్టర్కు అప్పీలు చేసుకునే అవకాశం భూభారతిలో ఉందని అన్నారు. ఈ అవగాహన సదస్సులో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, తాసిల్దార్ శ్రీనివాసరావు, రైతులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.