calender_icon.png 25 April, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల పరిష్కారం కోసం.. భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం

25-04-2025 07:38:36 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి, తాండూర్, కన్నెపల్లి మండల కేంద్రంలోని కన్నాల రైతు వేదికలో భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్(Additional Collector Sabavat Motilal) తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రారంభించిందని, ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కులపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు.

రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం, సంబంధిత వారసులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

పాసు పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, భూధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్స్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అవకాశం వంటి అంశాలను పొందు పర్చడం జరిగిందన్నారు.

ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వ తేదీ వరకు సమస్యల పరిష్కరించి, మిగిలిన మండలాలలోని సమస్యలను గుర్తించి ఆగస్టు 15వ తేదీ లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని, సర్వే ప్రక్రియలో సంబంధిత సర్వేయర్లు, ఇతర అధికారుల నియామకంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామస్థాయిలోని సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని, రైతులకు పట్టాభూమి, లావుని పట్టా, ఇతర రకాల భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ ఆదేశాలు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

టైటిల్, పొసెషన్ సంబంధిత సమస్యలు, కోర్టులో కొనసాగుతున్న కేసులను మినహాయించి మిగిలిన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ చట్టంలలోని అంశాలు, హక్కులపై రైతులకు అవగాహన కార్యక్రమాలతో వివరిస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసిల్దార్ జోత్స్న, మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్, తాండూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, కన్నెపల్లి తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరీ రామచందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, ఏఎం సీ చైర్మన్ చింత స్వామి, వైస్ చైర్మన్ కంకటి శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.