calender_icon.png 28 April, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం పారదర్శకం

28-04-2025 06:18:59 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ...

కాటారం (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం సులభం, పారదర్శకమైనదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) తెలిపారు. సోమవారం పలిమెల, మహాదేవపూర్ మండల కేంద్రాలలోని రైతు వేదికలో భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన భూ భారతి చట్టం యొక్క ప్రాముఖ్యతను పవర్ పాయింట్ ద్వారా వివరించి, ప్రజలు అడిగిన సమస్యలకు సమాధానాలు తెలియచేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... సామాన్యులకు బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ  సత్వర సేవలు భూ భారతి చట్టం ద్వారా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

భూ సమస్యలు పరిష్కారానికి దరణిలో సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ భూ భారతి చట్టంలో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని అన్నారు. భూ సమస్యలు పరిష్కారానికి ప్రజలకు సులువుగా, సులభతర పారదర్శకమైన చట్టం అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వం నిపుణుల కమిటీ చేత దేశ వ్యాప్తంగా విచారణ చేసి నూతన భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా అప్పీలు వ్యవస్థ అందుబాటులో ఉంటుందని, అప్పటికి న్యాయం జరగకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ద్వారా సామాన్యులకు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించనున్నట్లు తెలిపారు. 

గతంలో ఉన్న ధరణి వలన రెవెన్యూ అధికారులకు పవర్స్ లేకపోవడం వల్ల సమస్యలను పరిష్కరించలేకపోయారని, సామాన్య ప్రజలు సివిల్ కోర్టు తదితర మార్గాల ద్వారా న్యాయం పొందలేక సమస్యలు అలాగే ఉండిపోయాయని అన్నారు. నూతన భూ భారతి ఆర్ఓఆర్ చట్టం 2025 ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి సెక్షన్ల వారిగా ఏర్పాటు చేయడం జరిగిందని, తద్వారా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దరఖాస్తులు స్వీకరించి ఇరు వర్గాల వారికి నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి సమస్యను పరిష్కరించడం కోసం తహసిల్దార్, రెవిన్యూ డివిజనల్ అధికారి, కలెక్టర్ స్థాయిలలో నిర్ణీత సమయంలో రైతుల న్యాయం జరిగేలా చట్టం రూపొందించారని అన్నారు.

ప్రస్తుతం అన్ని స్థాయిలలో రైతులకు అప్పీల్ (దరఖాస్తులు ) చేసుకునే అవకాశం ఈ నూతన చట్టంలో ఉందని అన్నారు. అందుకోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలన అధికారులను, సర్వేయర్లను నియమించడం కోసం చర్యలు తీసుకుంటుందన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకోవడం కోసం పకడ్బందీ ప్రణాళికా ప్రకారం ముందుకు సాగుతున్నామని రైతులు, ప్రజలు, అన్ని వర్గాల వారు ఈ నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన పెంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ అవగాహన సదస్సులో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పలిమెల తహసిల్దార్ అనిల్, ఎంపీడీవో శ్రీనివాస్, మహాదేవపూర్ తహసిల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి పాల్, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.