18-04-2025 01:46:42 AM
ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్, ఏప్రిల్ 17 (విజయ క్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చిక్కులు లేకుండా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, ఇక ఎలాంటి భూ సమస్యలు తలెత్తవని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గురువారం రైతు వేదికలో భూభారతిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ప్రవేశపెట్టిన ‘ధరణి’ వల్ల భూముల రికార్డులు సరిగా లేకపోవడం వల్ల రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో కొత్తగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చట్టం అమలు చేస్తామని ప్రకటించిన విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చామన్నారు.
కొత్త చట్టం వల్ల రైతులకు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కే. వీరబ్రహ్మచారి, ఆర్డీవో గణేష్, తహసిల్దార్ సైదులు, రైతులు పాల్గొన్నారు.