22-03-2025 10:15:57 PM
పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ
భద్రాచలం,(విజయక్రాంతి): భారత ఉపఖండాన్ని ప్రభావితం చేస్తూ ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజగురు, సుఖ దేవ్ లు స్ఫూర్తితో ఉద్యమించాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాచలం పట్టణం సాయి డిగ్రీ కళాశాలలో శనివారం భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ జీవిత పాఠ్యాంశాన్ని మరణ సందేశాన్ని విద్యార్థుల్లోకి తీసుకొని వెళ్లేందుకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో బునిగల శివప్రసాద్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంపాటి పృథ్వీ మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామంలో వందలాదిగా ఉద్భవించిన సాయుధ విప్లవ వీరులలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు ప్రత్యేకతను సొంతం చేసుకున్నారని, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య లను మార్క్సిజాన్ని జోడించి విశ్లేషించిన మహ మెదడును దేశం కోల్పోయిందని భగత్ సింగ్ 94వ వర్ధంతిలో ఆయన అన్నారు.
సామ్రాజ్యవాదానికి, పెట్టుబడుదారి విధానానికి, కులతత్వానికి,మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడే భారత ప్రజలకు భగత్ సింగ్ నిరంతర పోరాట స్ఫూర్తిదాయకమని వారు అన్నారు. నేడు భారతదేశం హిందుత్వ ఫాసిజం తో ప్రత్యేకమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని భగత్ సింగ్ అతని సహచరులు రాజగురు,సుఖ దేవ్ లు ఏ విధంగా అయితే మతాన్ని పూర్తిగా వ్యక్తిగతమని ప్రకటించి మతాన్ని అన్ని స్థాయిల్లో తీవ్రంగా వ్యతిరేకించి మతం విషయంలో రాజీ పడిని శత్రువుల్లా వ్యవహరించారో నేడు భారత విద్యార్థి, యువకులు వారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు దేశంలో ఒకే జాతి ఒకే మతం ఒకే భాష అంటు ఫెడరల్ సూత్రాలకు వ్యతిరేకంగా బిజెపి పాలన కొనసాగిస్తుందని అందులో భాగంగానే పార్లమెంట్ అభిప్రాయాలను సైతం లెక్కచేయకుండా నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడం కోసం స్కిల్ ఇండియా పేరుతో బలవంతంగా ఆమోదించుకొని ప్రభుత్వ విద్యను బలిపీఠంపై ఎక్కిస్తుంది.
యూనివర్సిటీల నూతన ముసాయిదాను తీసుకొచ్చి విశ్వవిద్యాలయాలలో పరిశోధక విద్యార్థులపై, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేస్తుంది. దేశంలో కోట్లాదిమంది విద్యార్థి యువకులను కంపెనీ యాజమాన్యాలకు బానిసలను అందించే విధంగా విద్యా వ్యవస్థ మార్చబోతుంది. బిజెపి అనుసరించే విధానాలపై నేటి విద్యార్థి యువకులు భగత్ సింగ్ రాజగురు,సుఖదేవుల స్ఫూర్తితో ప్రశ్నించి వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. సెమినార్ అనంతరం భద్రాచలం డివిజన్ నూతన కమిటీని 15 మందితో ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీతో పి డి యస్ యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ ప్రమాణస్వీకారం చేయించారు. భద్రాచలం డివిజన్ పీడీఎస్యు డివిజన్ అధ్యక్షులుగా గడుగుల రామచరణ్, డివిజన్ కార్యదర్శిగా మునిగేలా శివ ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా కే అక్షయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా యం భూమిక, కోశాధికారిగా పండు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు సభ్యులుగా డి. సారాయి, ఎస్కే నాజీనా మౌనిక, ఎస్కే రజిన, నవీన, సంజు, హేమంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.