19-03-2025 02:03:20 AM
సిరిసిల్ల, మార్చి18 (విజయ క్రాంతి): కుక్క కాటుకు గురై, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యాధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టేముక్కల సువర్ణ పై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది.
దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విద్యార్థినిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గాయపడ్డ విద్యార్థిని అస్పత్రిలో మంగళవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని సూచించారు.
విద్యార్థినికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని బాలిక తల్లితండ్రులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు.అనంతరం ఆసుపత్రిలోని వార్డులను, బ్లడ్ బ్యాంక్ అయన పరిశీలించారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడి, వైద్య సేవల తీరుపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వైద్య సిబ్బంది ని ఆదేశించారు.