21-03-2025 12:51:31 AM
- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. మార్చి 20(విజయక్రాంతి) : ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం ఉంచి ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం దామరగిద్ధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలెక్టర్ పరిశీలించారు. మందుల నిల్వ రిజిస్టర్, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది సకాలంలో హాజరై రోగులకు సేవలు అందించాలని ఆదేశించారు. అసత్రిలో నిల్వ ఉంచిన మందులను, వ్యాక్సిన్లను ఆమె పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి వారికి అంది వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇటీవలే కుటుంబ తగాదాల వల్ల చెవికి గాయమై చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన దామర గిద్ద మండల కేంద్రానికి చెందిన వివాహితతో కలెక్టర్ మాట్లాడారు. నిబంధనల ప్రకారం బాధితురాలికి తగిన న్యాయం, సాయం చేయాలని అక్కడే ఉన్న సఖీ కేంద్ర నిర్వాహకురాలు క్రాంతి రేఖకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, తహాసిల్దార్ జలీల్, ఎంపీడీవో సాయి లక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.