జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకునడంతో పాటు మందుల పంపిణీపై సమాచారం తీసుకున్న తర్వాత ఆస్పత్రిలో ప్రసవాల గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ప్రభుత్వం పేద రోగుల వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని వాటిని క్షేత్రస్థాయిలో అందేలా చూడాలన్నారు. జిల్లాలో జరిగే ప్రతి ప్రసవం ఆసుపత్రిలో జరిగే విధంగా వైద్య సిబ్బంది చూడాలన్నారు. దీనికోసం గర్భం దాల్చిన మహిళలను గుర్తించి వారికి తొమ్మిది నెలలపాటు అవసరమైన పౌష్టికాహారం అందించడంతో పాటు సుఖప్రసవానికి సిబ్బంది కృషి చేయాలన్నారు.
అప్పుడే వైద్య సేవలపై సాధారణ ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు అత్యవసరమైతే తప్ప వేరొక చోటికి పంపించకూడదన్నారు. సౌకర్యాలను రోగులకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. డయాలసిస్ సెంటర్ ను సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడి వారికి సరైన సౌకర్యాలు అందించాలన్నారు. ప్రతిష్టాత్మకంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉంటుందని సేవలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 320 పడకల ఆసుపత్రిని పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ ప్రవీణ్, ఇతర సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.