సాంకేతికత వినియోగంతో అద్భుత ఫలితాలు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కృత్రిమ మేథా వినియోగంతో రోగ నిర్ధారణ మరింత మెరుగవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సోమవారం హెచ్ఐసీసీలో బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సంస్థ ఏఐ ఆధారిత ఉత్పత్తులను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికత ఆరోగ్య సంరక్షణలో కాకుండా.. జీవితాల్లో అనేక మార్పులకు ఉపయోగపడుతుందన్నారు. టెక్నాలజీ వినియోగంతో చికిత్సలో మెరుగైన ఫలితాలను వస్తాయన్నారు. అధునాతన సాంకేతికతతో ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతాడని స్పష్టం చేశారు.
ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొత్త ఉత్పత్తులకు అవకాశం లభిస్తుందన్నారు. ఆయా ఉత్పత్తులకు సంబంధించిన వైవిధ్యమైన పరిష్కారాలను రూపొందించడంలో సమర్థవంతంగా కృషి చేస్తోందని తెలిపారు. ఏఐ సాంకేతికత ఉత్పాదకతను పెంపొందించడమే కాకుండా సృజనాత్మకత, పురోగతిపై కూడా దృష్టి సారించడానికి వీలు కల్పిస్తుందన్నారు.
అయితే మానవజాతికి అనుకూలంగా, బాధ్యతాయుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, బ్లూ క్లౌడ్ సాఫ్ట్టెక్ చైర్మన్ జానకీ యార్లగడ్డ పాల్గొన్నారు.