16-04-2025 11:57:08 PM
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు..
మమత వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ..
కోల్కతా: వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో అల్లర్లు, హింసాకాండ చెలరేగడంపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘యోగి ఒక పెద్ద భోగి’ అని విమర్శలు గుప్పించారు. ముర్షీదాబాద్లో హింసాకాండ అనంతరం ఇమామ్లతో మమత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. యోగి చాలా పెద్ద మాటలు చెబుతున్నారని, ఆయన అతిపెద్ద భోగి అని అన్నారు.
మహాకుంభ్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర్ప్రదేశ్లో అనేక మందిని ఎన్కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని విమర్శించారు. బెంగాల్లో ఎంతో స్వేచ్ఛ ఉందని తెలిపారు. కేంద్రం బెంగాల్ ప్రభుత్వం, తనపై వ్యతిరేకంగా మాట్లాడటమే పనిగా పెట్టుకుందని మమత ఆరోపించారు.
మమతా వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగిని పెద్ద భోగి అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అల్లర్లను మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నందునే యోగి వ్యాఖ్యలు ఆమెకు నచ్చడం లేదని యూపీ బీజేపీ ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి అన్నారు. కాగా ముర్షీదాబాద్ హింసాకాండపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బెంగాల్ తగులబడుతుంటే ముఖ్యమంత్రి చోధ్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఆందోళనకారులను శాంతి దూతలుగా భావిస్తున్నారని విమర్శించారు. బెంగాల్లో విధ్వంసం జరుగుతుంటే కాంగ్రెస్, సమాజ్వాదీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు.