calender_icon.png 12 March, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంతపనాయె ఎలమందా!

17-05-2024 01:08:38 AM

గొర్రెల పంపిణీకి సర్కారు మంగళం

గొల్లకుర్మలకు డీడీ డబ్బులు వాపస్

గొర్రెల యూనిట్లే కావాలని లబ్ధిదారుల డిమాండ్ 

కరీంనగర్, మే 16 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన గొర్రెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభు త్వం మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రాష్ట్రస్థాయిలో పశుసంవర్థక శాఖ కార్యాలయంలో గొర్రెల పంపిణీకి సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో గత ప్రభుత్వం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీని తిరిగి ప్రారంభిస్తుందని గొల్లకుర్మలు ఆశించారు. అయి తే, రెండో విడతకు సంబంధించిన డీడీ డబ్బులను ప్రభుత్వం వాపస్ ఇస్తుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఆలస్యమైనా గొర్రెలు చేతికి వస్తాయనుకుంటే డీడీలు చేతిలో పెడుతుండటంతో ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్టేనని చర్చ మొదలైంది. 

2,666 మందికి డీడీలు వాపస్

మొదటి విడత గొర్రెల పంపిణీలో భాగం గా లబ్ధిదారులకు ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలును అందజేశారు. వీటి విలువ రూ.1.58లక్షలు. ఇందు లో ప్రభుత్వ రాయితీ పోగా లబ్ధిదారుడి వాటా రూ.43,750 డీడీల రూపంలో చెల్లించారు. రెండో విడతలో యూనిట్ విలువను పెంచారు. యూనిట్ విలువ రూ.౧.75 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారుడి వాటా రూ.43,700 డిపాజిట్ల రూపంలో పశుసంవర్థకశాఖ వసూలు చేసింది. కరీంనగర్ జిల్లా లో 3,404 యూనిట్లు మంజూరు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఆ నియోజవర్గంలో 718 గొర్రెల యూనిట్ల పం పిణీ చేశారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో రెండో విడత ఉంటుందని అనుకున్నప్పటికీ 2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసేనాటికి కేటాయింపులు జరగలేదు. మిగిలిన 2,666 మందికి డీడీలు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రస్తుతం అధికారులు ప్రారంభించారు. జిల్లాలో మొదటి విడతలో 11,236 యూని ట్లు పంపిణీ చేశారు. రెండో విడతలో 13,09 8 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3,404 యూనిట్లు మంజూరు చేశారు. ఈ రెండో విడత ఐదేండ్లుగా ఊరిస్తూ లబ్ధిదారులకు చివరకు నిరాశను మిగిల్చింది.

మాకు డీడీలు వద్దు యూనిట్లు కావాలి

గొర్రెలు వస్తే గొల్లకుర్మల బతుకులు మారుతాయని భావించినం. గత ప్రభుత్వం మొదటి విడత గొర్రెలు ఇచ్చి, రెండో విడత పంపిణీని గాలికి వదిలేసింది. కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని చూస్తుంది. ౪ ఏండ్ల క్రితం యూనిట్‌కు రూ.43,700  చొప్పున డీడీలు చెల్లించినం. ఇప్పుడు వారికి తిరిగి డీడీలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. మాకు డీడీలు వద్దు, గొర్రెల యూనిట్లే కావాలి. నాలుగేండ్ల క్రితం అప్పులు చేసి చెల్లించిన వారు ఉన్నారు. కొత్త ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. మరింత మెరుగైన మార్గదర్శకాలతో పథకాన్ని కొనసాగించాలి. 

- బండి మల్లయ్యయాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్

పుస్తెలు అమ్మి డబ్బులు చెల్లించారు 

ప్రభుత్వం కల్పించిన అవకాశంతో బతుకులు బాగు పడుతాయని కొందరు పుస్తెలు అమ్మి యూనిట్ డబ్బులు చెల్లించినారు. నాలుగేండ్లుగా  గొర్రెలు ఇస్తామని ఊరిస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అందుకే గద్దె దిగింది. కొత్త ప్రభుత్వం డీడీలు వాపస్ ఇస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఈ పథకాన్ని కొనసాగించాలి. మాకు డీడీలు, డబ్బులు వెనక్కి ఇవ్వొద్దు. గొర్రెలను కేటాయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల, కురుమల సంక్షేమంపై దృష్టి సారించాలి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలైనా కల్పించాలి. 

- కొమురయ్య యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి