నిబంధనలు పట్టించుకోని ప్రైవేట్ విద్యాసంస్థలు
సెలవుల్లో యథేచ్ఛగా తరగతుల నిర్వహణ
ఖమ్మం జిల్లాలో పత్తాలేని యంత్రాంగం
ఫిర్యాదు చేసినా పట్టించుకోని విద్యాశాఖ
ఖమ్మం, అక్టోబర్ 3 (విజయక్రాంతి): ఖమ్మంలో విద్యా శాఖ ఆదేశాలు భేఖాతరయ్యాయి. దసరా పండుగ సందర్బంగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
కానీ, ఖమ్మంలో ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఎక్కడా పాటించట్లేదు. ప్రభుత్వ ఆదేశాలతో తమకేమి పని లేదన్నంటూ వ్యవహరిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా బడులు తెరి చి, తరగతులు నిర్వహించడం విమర్శలకు దారితీసింది.
అసలే అనేక వివాదాలకు నెలవైన ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఆదేశాలను కార్పొరేట్ విద్యా సంస్థలు పక్కకు పెట్టడంపై అనుమానాలకు తావిస్తున్నాయి. ఖమ్మం నగరంలో సుమారు 60 దాకా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఒకటి రెండు మినహా దాదాపుగా అన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు క్లాసులు నిర్వహిస్తుండటం గమనార్హం.
ఆదేశాలు బుట్టదాఖలు
దసరా సెలవుల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ వి ద్యా సంస్థలు తెరిచి, క్లాసులు నిర్వహించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచే సింది. సెలవుల్లో రెగ్యులర్గా తరగతులు నిర్వహించినా, ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకొం టామని ప్రభుత్వం పేర్కొన్నది.
కానీ, ఖమ్మంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలను తుంగలో తొక్కి విద్యా సంస్థలు తెరిచి, క్లాసులు నిర్వహించడంపట్ల విద్యార్థి సంఘా లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సెలవుల్లో సైతం పాఠాలు బోధించడం ద్వారా విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంటున్నారు. తరగతులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు చేసినా విద్యాశాఖాధికా రులు అటు వైపు కన్నెత్తి చూడట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు ఉల్లం ఘించి, తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం నగరంతోపాటు నేలకొండపల్లి వంటి చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా గురువారం నడిచాయి.