calender_icon.png 25 September, 2024 | 2:06 PM

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

25-09-2024 12:47:21 AM

వైద్యులు దవాఖానల్లో అందుబాటులో ఉండాలి

రంగారెడ్డి జిల్లా అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. వైద్యులు, సహాయక సిబ్బంది సెలవులు తీసుకోకుండా హెల్త్ సెంటర్లు, దవాఖానల్లో రోజంతా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

ఇటీవల కురుస్తున్న వర్షాలకు దోమలు పెరిగి ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం పాలయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం బంజారాహిల్స్ మినిష్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, సంచార వైద్యశాలలు ప్రతి గ్రామానికి వెళ్లేలా చూడాలని ఆదేశించారు.

పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, జిల్లా దవాఖానల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వ్యాధిగ్రస్తుల వివరాలు సేకరించి, సమీపంలోని దవాఖానలకు తరలించేలా వైద్యాధికారులతో సమన్వయం కొనసాగించాలని పేర్కొన్నారు. పసిపిల్లలు, గర్భిణిలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.

డెంగ్యూ, చికున్ గున్యాలకు కారణమయ్యే దోమల నియంత్రణ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని వెల్లడించారు. ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. సమీక్షలో కలెక్టర్ శశాంక్, డిప్యూటీ కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి తదితరులు పాల్గొన్నారు.