ప్రధాని మోదీకి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య లేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయక్రాంతి) : రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అనే ముద్రను పోగొట్టుకోవాలన్నా, బీసీలు బీజేపీని నమ్మాలన్నా తక్షణమే కులగణన చేపట్టి, బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారనే వార్తలను ప్రజలు తీవ్రంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్య ప్రధాని మోదీకి శనివారం లేఖ రాశారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 రిజర్వే షన్లు కల్పిస్తే 70 కోట్ల మంది బీసీలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడతారని స్పష్టం చేశారు.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ లేఖలో పేర్కొ న్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నట్టు మోదీకి గుర్తు చేశారు. బీజేపీ 17 సంవత్సరాలుగా దేశాన్ని పాలించినా బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థిక అభివృద్దికి ఒక్క చిన్న స్కీం కూడా పెట్టలేదన్నారు. అందుకే బీసీలు బీజేపీని నమ్మడం లేదన్నారు. కుల వృత్తులను కోల్పోయిన వారికి ప్రత్యేక ఉపాధి కల్పించి, ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షల సబ్సిడీ ఇవ్సాల్సిందిగా ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.