బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్...
మునుగోడు (విజయక్రాంతి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడే కుట్ర చేస్తూ బీసీలను దగ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్ విమర్శించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన బీసీ కులగణన సర్వే రిపోర్టు పూర్తిగా బూటకపు సర్వేగా అభివర్ణిస్తున్నామని, సర్వేలో గత 2014 సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతంగా ఉన్న బీసీల సంఖ్యను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలు 46 శాతానికి కుదించడం దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఓసీల సంఖ్యను రెట్టింపు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలా సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపడం హేయమైన చర్య అని, మొత్తం బీసీల సంఖ్య గత పది సంవత్సరాల నుండి పెరగాలి కాని తగ్గుతుందా అని రిజర్వేషన్లు కుదించి ఓసీల సంఖ్యను ఎక్కువ చూయిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నడుస్తున్నది ప్రజాపాలన కాదని రెడ్డి పాలనని అగ్రకుల పాలనని మొత్తం రెడ్లతో అసెంబ్లీ, శాసనమండలి నిండిపోయిందని బీసిలకి స్థానం లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన సర్వే రిపోర్ట్ కాపీలని రాష్ట్రవ్యాప్తంగా తగలబెడతామని తక్షణమే తిరిగి హైదరాబాద్ తో సహా రీ సర్వే చేసి అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.