ముస్లిం మైనారిటీ బీసీలు 10.08 శాతం
మొత్తం బీసీలు 56.33 శాతం
- కులగణనలో పాల్గొన్న వారు 96.9 శాతం
- సర్వేలో పాల్గొనని జనాభా 3.1 శాతం
- రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క
- వెయ్యి పేజీలతో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. తెలంగాణలో బీసీలు 46.25 శాతం మంది ఉన్నట్టు కులగణన సర్వే తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. దాదాపు వెయ్యి పేజీలతో కూడిన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీకి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బీ వెంకటే శ్వరరావు ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా సర్వే నివేదికపై దాదాపు గంటన్నరకుపైగా సబ్ కమిటీ చర్చించింది. నివేదికలోని కీలక అంశాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
సర్వేలో 1.12 కోట్ల కుటుంబాలు
3.54 కోట్ల మందిని ప్రణాళిక శాఖ సర్వే చేసింది. ఇందులో వెనుకబడిన వర్గాలు (బీసీ) మొత్తం 1.64 కోట్ల మంది ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉండగా.. 1,12,15,134 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. వివిధ కారణాలతో 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదు. రాష్ట్రంలో మొత్తం 96.9 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు. రకరకాల కారణాలతో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదు. 1.03 లక్షల ఇండ్లకు తలుపులు వేసి ఉన్నాయి. 1.68 లక్షల కుటుంబాలు మొదట్లో సర్వేలో పాల్గొనడానికి సంకోచించాయి. 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉన్నట్టు సర్వేలో గుర్తించారు.
36 రోజుల్లో డాటా ఎంట్రీ పూర్తి
94,863 మంది ఎన్యూమరేటర్లు, 9,628 మంది సూపర్వుజర్లతో ఈ సర్వేను 50 రోజుల్లో పూర్తి చేశారు. రాష్ట్రాన్ని 94,261 బ్లాక్లుగా విభజించారు. రోజుకు ఒక్కో ఎన్యూమరేటర్ 8 నుంచి 10 ఇండ్లను సర్వే చేశారు. సర్వే పత్రాలను ఆన్లైన్ చేయడానికి 76,000 డాటా ఎంట్రీ ఆపరేటర్లను ప్రణాళిక శాఖ నియమించుకున్నది. 36 రోజుల్లో ఈ సమాచారాన్ని డిజిటలైజ్ చేసింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో సర్వే పత్రాలను డిజిటలైజ్ చేసింది.
సర్వేలో పాల్గొన్న జనాభా
లింగం జనాభా శాతం
పురుషులు 1,79,21,183 50.51%
మహిళలు 1,75,42,597 49.45%
ఇతరులు 13,774 0.04%
మొత్తం 3,54,77,554