మంత్రులు కొండా సురేఖ, సీతక్క
మెదక్లో బతుకమ్మ వేడుకలకు హాజరు
మెదక్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమాన్ని సంఘటిత శక్తిగా మార్చడంలో బతుకమ్మ ప్రత్యేక పాత్ర పోషించిందని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు.
మెదక్లోని బాలుర జూనియ ర్ కళాశాల గ్రౌండ్లో సోమవారం మైనంపల్లి హన్మంతరావు స్వచ్ఛంద సంస్థ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ‘మన ఇంటి బతుకమ్మ’ కార్యక్రమానికి మంత్రులు సురేఖ, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చూపిన చొరవ ప్రశంసనీయమని కొనియాడారు.
అనంతరం మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 10 వేల మంది మహిళలకు చీర లను పంపిణీ చేశారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి వాణి, మైనంపల్లి శివాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద, శోభారాణి, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ మహేందర్, ఆర్డీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.