హుజురాబాద్, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. మహిళలకు గాజులు, పండ్లు, పూలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల వాయినంగా అందజేశారు. తీరొక్క పూలతో ప్రకృతిని దైవంగా భావించి ఆడబిడ్డలు జరుపుకునే పండుగ బతుకమ్మను ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పూల జాతరకు కాంగ్రెస్ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని ఆడి, పాడారు.
ఆద్యంతం వైభవంగా జరిగిన ఈ బతుకమ్మ సంబరాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సంబరాలు మహిళల కొలాటాలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పండుగ శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి శివ-రేణుక, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, ఇల్లంతకుంట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొడం రజిత, మహిళా విభాగం కడారి తిరుమలతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.