calender_icon.png 23 October, 2024 | 6:01 PM

పిడికెడు మందికి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా?

18-09-2024 01:38:50 PM

ఒవైసీకి భయపడి విమోచన దినోత్సవం  జరపకపోవడం సిగ్గు చేటు

తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరం

బీజేపీ అధికారంలోకి వస్తే సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, (విజయక్రాంతి): మావల్లే తెలంగాణ వచ్చింది. మేం బిల్లు పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న పార్టీలు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో సీబీసీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఈ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే...ఆ సమయంలో తెలంగాణకు స్వాతంత్ర్యం ఎందుకు రాలేదు..? దానికి కారకులెవరు? తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది?  అనే విషయాలను నేటి తరానికి పూర్తిగా తెలియజేయలేకపోవడం విడ్డూరమన్నారు.

రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు. ‘‘పిడెకెడు మంది ఉన్న దరిద్రపు పార్టీ ఎంఐఎం. ఆ పార్టీకి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా? ఉద్యమ పార్టీ అవుతుందా?’’అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో కరీంనగర్ లోని టీఎన్జీవోస్ భవన కళ్యాణ మండపంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ  యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘ఫొటో ఎగ్జిబిషన్’ను కేంద్ర మంత్రి ప్రారంభించారు.