calender_icon.png 30 September, 2024 | 12:57 PM

మా ప్రాణాలు తీశాకే.. ప్రజల ఇండ్లపై దాడులకు వెళ్లండి

30-09-2024 10:35:39 AM

హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుంది

కుటుంబ వారసత్వ పార్టీలంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్

 తమిళనాడులో తండ్రి సీఎం.. కొడుకు డిప్యూటీ సీఎం

కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకేసహా కుటుంబ పార్టీల్లో కార్యకర్తలకు ముఖ్య పదవులివ్వరా?

కుటుంబ, వారసత్వ పార్టీలను బొంద పెట్టండి

కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, (విజయక్రాంతి); అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే, మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అవినీతికి తెర తీస్తోందన్నారు.. అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే.... ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుండి వసూళ్లు చేసే తంతుకు తెరదీశారని అన్నారు. హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో బీజేపీ ప్రజలకు ఆయుధంగా మారబోతోందని, తమ ప్రాణాలను అడ్డు పెట్టి అయినా ప్రజల ఆస్తులను కాపాడతామన్నారు. తమ ప్రాణాలను తీసిన తరువాత పేదల ఇండ్లపైకి హైడ్రా దాడులు చేసుకోవాలన్నారు. హైడ్రా తీరును దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.