మట్టి పోసి చదును చేసిన రియల్ వ్యాపారులు
పటాన్చెరు, జూలై12: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధంకొమ్ము చెరువు క్రమంగా ఆక్రమణకు గురవుతోంది. ఇప్పటికే చెరువు చుట్టూ రియల్ వ్యాపారులు అవకాశం ఉన్న వరకు ఆక్రమించారు. మరింత ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు బంధంకొమ్ము చెరువులో కొందరు తమ భూమి అని మట్టి పోసి చదు ను చేశారు. దీంతో 27 ఎకరాలలో ఉన్న ఈ చెరువు రోజురోజుకు కుచించుకుపోతోంది. బంధంకొమ్ము చెరువు ఆక్రమణకు గురవుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏడు సంవ త్సరాల క్రితం జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచిన బంధంకొమ్ము చెరువు నేడు డ్రైనేజీ నీటికి కేంద్రంగా మారింది.
చెరువు చుట్టూ కాలనీలు వెలిశాయి. ఈ కాలనీల డ్రైనేజీ నీరు చెరువులోకి వదులుతున్నారు. బంధంకొమ్ము చెరువులో జీవవైవిధ్యాన్ని ప్రత్య క్షంగా చూసిన ప్రజలు నేడు డ్రైనేజీ నీటితో కలుషితమైన చెరువును చూస్తున్నారు. అమీన్పూర్ వైపు నుంచి, బంధంకొమ్ము వైపు నుంచి చెరువులో మట్టి పోస్తూ రియల్ వ్యా పారులు క్రమంగా పూడుస్తున్నారు. చెరువుపై భాగంలో ఇదే పరిస్థితి. ఇంత జరుగు తున్నా ఏ అధికారీ స్పందించడం లేదని ప్రజ లు చెబుతున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా, చుట్టు పక్కల వారి నుంచి ఫిర్యాదు లు వచ్చిన చర్యలు లేవని అంటున్నారు. చెరువులో మట్టి పోసి కూడా దాదాపు మూడు నెలలు కావొస్తుంది. మట్టి పోసిన ప్రాంతంలో త్వరలోనే నిర్మాణాలు చేపట్టినా ఆశ్చర్యం లేదు.