01-03-2025 12:12:49 AM
కరీంనగర్, ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి): కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎన్నికల పరిశీలకులు బెనర్ మహేష్ దత్ ఎక్క, బుద్ధ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల బ్యాలెట్ బాక్సులు ఉంచిన స్ట్రాంగ్ రూమ్లకు శుక్రవారం తెల్లవారు జామున సీళ్లు వేశారు.
ఈ సంద ర్బంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడు తూ.. గురువారం రాత్రి నుండి బ్యాలెట్ బా క్సులు రావడం మొదలైందని...శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ జిల్లా ల కు సంబందించిన మొత్తం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముకు చేర్చామని అన్నారు. ఎన్నికల అధికారుల కృషి, వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల సహకరంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.
ఈ నెల 3 నుండి జరిగే కౌంటింగ్ ప్రక్రియ సైతం సజావుగా సాగేందుకు అందరూ సహకరించా లని కోరారు. గ్రాడ్యుయేట్, పట్టభద్రుల బ్యాలెట్ బాక్స్ లను వేర్వేరుగా భద్రపరిచడం జరిగిందని అన్నారు. పోలింగ్ స్టేషన్ ల వారీగా లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఈ నెల 8 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
స్ట్రాంగ్ రూము వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లా యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద వద్ద ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలను తీసుకుందని, ప్రతీ రోజు ఎన్నికల అధికారులు వీటిని పర్యవేక్షస్తారని అన్నారు. అంబేద్కర్ స్టేడియం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.