యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 21(విజయక్రాంతి): భువనగిరి బాలసదన్లో ఓ పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం భువనగిరి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈనెల 14న భువనగిరి బాలసదన్లో లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అనాథ బాలికల హక్కు లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్ సర్వీసెస్లో పనిచేసే అటెండర్ కూడా హాజరయ్యాడు. సదరు వ్యక్తి పదేళ్ల అనాథ బాలిక ఒంటరిగా ఉండటం చూసి, లైంగిక వేధింపులకు గురిచేశాడు.
ఆమె ఏడుస్తూ బాలసదన్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. విషయం బయటకు పొక్కడంతో ఘటనపై సోమవారం మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ఫిర్యాదుమేరకు భువనగిరి పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.