calender_icon.png 25 October, 2024 | 8:02 AM

జానీ మాస్టర్‌కు బెయిల్

25-10-2024 01:12:33 AM

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత బాండు సమర్పించాలని, అదే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని, నిందితుడు, అతని కుటుంబ సభ్యులు ఎవరూ ఫిర్యాదుదారు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోకి వెళ్లకూడదని, ఆమెను నిందితుడు వ్యక్తితంగా కలవకూడదని షరతులు విధించింది.

మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు పోక్సో చట్టంకింద సెప్టెంబర్ 20న అరెస్టు చేశారు. ఆయన చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వా డి శ్రీదేవి విచారించారు.

బాధితురా లు ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని, అందు కు కారణాలు వెల్లడించలేదని తీర్పులో పేర్కొన్నారు. ఇద్దరూ ఇష్టపూర్వకంగా కలిసినట్లుగా బాధితురాలు అంగీకరించారనే విషయాన్ని ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టు రెండు కేసుల్లో వెలువరించిన తీర్పులను న్యాయమూర్తి ఉదహరించారు.

శంభుఖర్వాన్ వర్సెస్ యూపీ, అన్సర్ మహ్మద్ వర్సెస్ రాజస్థాన్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఈ కేసులో వర్తిస్తాయని తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తూ కేసును ప్రభావితం చేయడంగానీ, సాక్షులను బెదిరించడంగానీ చేయరాదని ఆదేశించారు.