calender_icon.png 25 September, 2024 | 8:02 AM

ఫార్మసిస్ట్ పోస్టుల్లోంచి ఆయూష్ మినహాయింపు

25-09-2024 04:43:42 AM

  1. నోటిఫికేషన్ నుంచి ఆయూష్ ఫార్మసిస్టు 
  2. పోస్టులను మినహాయించిన ప్రభుత్వం 
  3. హర్షం వ్యక్తంచేసిన కాంట్రాక్టు ఆయూష్ ఫార్మసిస్టులు
  4.  నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం 
  5. కాంట్రాక్టు ఆయూష్ ఫార్మసిస్టుల హర్షం

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అల్లోపతిలో 633 ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. 2024 ఆగస్టు 2న ప్రభుత్వం జారీచేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం 2024 సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.

అయితే, జాబ్ క్యాలెం డర్‌లో ఆయూష్ ఫార్మసిస్టు పోస్టుకు ‘ఆయూష్ డిప్లమా ఇన్ ఫార్మసిస్ట్’ కోర్సును విద్యార్హతగా పేర్కొన్నారు. వాస్తవానికి ఈ కోర్సు రాష్ట్రంలోని ఏ విద్యాలయంలో లేదు. అలాగే ఈ కోర్సు చదివినవారు రాష్ట్రం లో లేరు. ఈ వ్యవహారంపై ‘ఇచ్చంత్రం.. ఆ కోర్సు లేదు.. అభ్య ర్థులూ లేరు’ శీర్శికతో సెప్టెంబర్ 14న ‘విజయక్రాంతి’లో కథనం ప్రచురితమైంది.

జరిగిన పొరపాటును సవరించుకునేందుకు అల్లో పతి ఫార్మసిస్టులతో ఆయూష్ పోస్టులను భర్తీ చేయాలని, అందుకు జీవో  రద్దు చేయడంతోపాటు సర్వీసు రూల్స్‌ను మార్చాలంటూ ఆయూష్ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాయడంతోపాటు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించారు.

ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఆయూష్ అధికారులు చేస్తున్న తప్పులపై ‘ఆయూష్.. మరో నిర్వాకం’ శీర్శికతో ఈ నెల 24న ‘విజయక్రాంతి’ మరో కథ నం ప్రచురించింది. ఈ రెండు కథనాలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సంచలనాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఆయూష్ ఫార్మసిస్టు పోస్టుల భర్తీ, అర్హత లతో పాటు ఆయూష్ అధికారుల ప్రతిపాదనలపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేపట్టింది.

అధికారుల ప్రతిపాదనల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం గత 17 యేండ్లుగా ఆయూష్‌లో కాంట్రాక్టు ఫార్మసిస్టులుగా పని చేస్తున్న సుమారు 309 మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది.

ఈ క్రమంలోనే మంగళవారం 308 ఆయూష్ ఫార్మసిస్టు పోస్టులను మినహాయించి అల్లోపతికి సంబంధించిన 633 పోస్టు ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆయూష్‌లో కాంట్రాక్టు ఫార్మసిస్టులుగా పని చేస్తున్న 309 మంది హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.