18-03-2025 01:30:09 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, మార్చి17 (విజయక్రాంతి) : పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు. అవసరమైతే అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించి అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఖరీఫ్లో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసుకునేలా చెప్పాలని, ఉద్యాన పంటలు సాగు వైపు ప్రోత్సహించాలన్నారు. బీహార్లో మఖానా పంటను అధికంగా పండిస్తున్నారని, దీని జిల్లాలోనూ సాగు చేయాలని కోరారు. నల్లగొండ, కట్టంగూరు, తిప్పర్తి, కొండమల్లేపల్లి, చందంపేట తదితర మండలాల్లో మఖానా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ మఖానా పంట సాగు పద్ధతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పదో తరగతి విద్యార్థులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులంతా కష్టపడి చదివి 10/10 జీపీఏ సాధించాలని కోరారు.