ఖమ్మం, (విజయక్రాంతి): ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లు రోడ్లపై వాహనాలు డ్రైవింగ్ చేయవద్దని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు విద్యార్థులకు సూచించారు. నగరంలో మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రాఫిక్ పోలీసుల తనిఖీలో అధిక సంఖ్యలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడున్న నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నగరంలోని హర్వెేస్ట్ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ...ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవర్లు అధిక సంఖ్యలో పట్టుబడుతున్నారని, మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజు నగరంలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారని తెలిపారు. గతంలో మైనర్ డ్రైవింగ్ చేస్తు పోలీసు వారికి పట్టుబడితే జరిమానా వేసి, తల్లిదండ్రులు కి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించడం జరిగిందని, ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులను న్యాయస్థానంలో హజరు పరచడం జరుగుతుందని తద్వారా న్యాయస్థానం శిక్ష / జరిమానా విధించే అవకాశం వుంటుందని అన్నారు. కాబట్టే మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. ఇప్పటికే మైనర్ డ్రైవింగ్, రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు గురించి అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తద్వార విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు, ఆర్ ఐ సాంబశివరావు, ఎస్సైలు రవి, వెంకన్న, సాగర్ పాల్గొన్నారు.