25-02-2025 06:06:02 PM
ఎల్ డి ఎం రాజేశ్వర్ జోషి...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్థిక అక్షరాస్యతపై మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాజేశ్వర్ జోషి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ బ్రాంచ్ లో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు పొదుపు పట్ల ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి రూపాయి కూడా ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలన్నారు.
అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుందని వీటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు. బ్యాంకు మేనేజర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ... భవిష్యత్తు అనిచ్చితంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కలిగి ఉండే విధంగా చూసుకోవాలన్నారు. మహిళా సంఘాల ప్రతినిధులకు ఎస్బిఐ అందిస్తున్న వివిధ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం అన్నాజీ, ఏపీఎం సదానందం, బ్యాంకు సిబ్బంది సంతోష్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.