calender_icon.png 20 September, 2024 | 3:28 PM

బంగారు పతకం సాధించిన అథ్లెట్‌కు సన్మానం

07-09-2024 12:23:01 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): యూరోప్‌లోని మాల్దాలో గత నెల 28న జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 66 కేజీల జూనియర్ విభాగంలో మొడెం వంశీ బంగారు పతకం సాధించాడు. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేసి కూలి పనులకు వెళ్తుండేవాడు. అయితే వంశీ తనకిష్టమైన వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీసును మరువలేదు. తండ్రి నర్సరీలో లేబర్‌గా పని చేస్తుండటంతో అతనికి తోడుగా వంశీ కూడా నర్సరీలో బరువైన పనులు చేస్తూ వెయిట్ లిఫ్టర్ అబ్దుల్ ఫరూక్ దృష్టిలో పడ్డాడు.

అబ్దుల్ ప్రోత్సామంతో భద్రాచలంలోని వెయిట్ లిఫ్టింగ్ కేంద్రంలో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకొని ఐటీడీఏ ఆర్థిక సహకారం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో యూరప్ వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించాడు. ఈ మేరకు శుక్రవారం వంశీని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్ వేర్వేరుగా సన్మానించారు. వంశీని స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.