calender_icon.png 27 October, 2024 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

13-08-2024 02:22:14 AM

  1. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచన
  2. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): మాదకద్రవ్యాలతో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయని, వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, డిసేబుల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ శైలజ సూచించారు. సోమవారం హైదరాబాద్ గోల్కొండ ప్రభుత్వ బాలుర ఉర్దూమీడియం ఉన్నత  పాఠశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. డ్రగ్స్ ఇండియా, డ్రగ్స్ తెలంగాణ అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఈవో రోహిణి, ఆర్డీవో మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ‘మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం సమాజాన్ని కాపాడుకుందాం’ పోస్టర్‌ను సోమవారం మేయర్ గద్వాల విజయలక్ష్మివిడుదల చేసి, సంతకాల సేకరణను ప్రారంభించారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎండీ జావీద్ అన్నారు. కార్యక్రమంలో డీవైఎప్‌ఐ నాయకులు కోట రమేష్, అనగంటి వెంకటేష్, దామోర హష్మీబాబు పాల్గొన్నారు.  

డ్రగ్స్ వినియోగంపై ప్రత్యేక నిఘా

గ్రేటర్ పరిధిలో గంజాయి, డ్రగ్స్ వినియోగం, సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. సోమవారం అబ్కారీ భవన్‌లోని సమావేశ మందిరంలో హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్‌శాఖ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఎన్డీపీఎస్ కేసులతో పాటు ఇతర కేసులకు అక్టోబరు 15 నాటికి చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి, హైదరాబాద్, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్లు శాస్త్రి, దశరథ్ పాల్గొన్నారు.