28-03-2025 01:56:59 AM
హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): ఇప్పటివరకు 125 బొగ్గు బ్లాకులను 11 దశల్లో విజయవంతంగా వేలం వేశామని, వీటిలో ప్రైవేటు రంగం కూడా భాగస్వామ్యం అయ్యిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఈ వేలం ద్వారా ఏకంగా రూ.40,960 కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని తెలిపారు. ఢిల్లీలోని తాజ్ హోటల్లో గురువారం జరిగిన 12వ కోల్ బ్లాక్ వేలం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తిలో బిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకున్న చరిత్రాత్మక సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమన్నారు.
ఈ లక్ష్యాన్ని చేరు కోవడంలో, సుస్థిర బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 12వ ట్రాంచేలో భాగంగా 28 బొగ్గు, లిగ్నయిట్ బ్లాకులకు వేలం నిర్వహించామని... ఈ వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు దిగుమతులు తగ్గడమే కాకుం డా, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడి, ఆత్మనిర్భర భారత్కు అసలైన నిర్వచనం ఇస్తున్నాయ నడంలో సందేహం లేదన్నారు.
ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా ఉత్పత్తి, స్టీలు రంగాల 72 శాతం విద్యుత్ అవసరాలను బొగ్గు తీరుస్తోందన్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో దేశ ఖనిజ, బొగ్గు రంగానికి సంబంధించి విజనరీ రోడ్ మ్యాప్ రూపొందించామని వెల్లడించారు. వ్యాపార అవకాశాలు, సృజనాత్మకత పెంపొందించేందుకు, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు మైనింగ్, బొగ్గు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామన్నారు.