11-04-2025 12:00:00 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : జిల్లాలో మాతృమరణాలు జరుగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గర్భిణీలకు తగు సూచనలు చేసి, చికిత్స అందించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో మాతృమరణాలపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ డెలివరీకి ముందు నుంచే గర్భిణీలకు సంరక్షణ సేవలు అందించాలని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు సూచించారు. హైరిస్క్ గర్భిణీలను గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధలు చూపాలని ఆదేశించారు. గర్భిణీలకు సకాలంలో వాక్సినేషన్ జరిగేలా, మందులు, చికిత్స అందించాలన్నారు.
గర్బిణుల ఫోన్ నంబర్లను ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు తమ వద్ద ఉంచుకుని ఫోన్ద్వారా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని ఆరా తీసి తగు సూచనలు చేయాలని చెప్పారు. గర్భిణులకు, బాలింతలకు అవసరమైన సేవలందిస్తున్నామని డీఎంహెచ్వో డా.వెంకటి తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జయమాలిని, డా.సూచేత, డా.సత్యవతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు అంగన్వాడీ బాట
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ఈ వేసవిలో అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పోషణ పక్షం సందర్భంగా గురువారం ఐసీడీఎస్ నాంపల్లి ప్రాజెక్ట్, హిమాయత్నగర్ సెక్టార్లోని భీమామైదాన్లో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు పోషకాహారాన్ని అందించాలని, ఎక్కువ మంది పిల్లలు హాజరయ్యేలా చూడాలని సూచించారు.