24-02-2025 12:00:00 AM
హాజరైన ఫిన్లాండ్, జపాన్ దేశస్తులు
సిద్దిపేట, ఫిబ్రవరి 23 ( విజయక్రాంతి) : సిద్దిపేట పట్టణంలో ఆదివారం జరిగిన ఓ వివాహ మహోత్సవంలో విదేశీయులు సందడి చేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కొత్త రాజశ్రీ శ్రీనివాస్ దంపతుల కుమార్తె రోహిణి వివాహం హుజురాబాద్ పట్టణానికి చెందిన పోతిరెడ్డి శ్రీనివాస్ జానకి దంపతుల కుమారుడు రాహుల్తో జరిగింది. పెళ్లి కుమారుడు రాహుల్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. పెళ్లి కుమారుని తండ్రి పోతిరెడ్డి శ్రీనివాస్ హైదరాబాదు పటాన్చెరులోని విజయ్ ఎలక్ట్రికల్స్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
విజయ్ ఎలక్ట్రికల్స్ జపాన్లోని ప్రసిద్ధ తోషిబా కంపెనీకి అనుబంధంగా ఉంది. దీంతో శ్రీనివాస్ ఆహ్వానం మేరకు తోషిబా కంపెని ప్రతినిధులు జపాన్ నుండి వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే యూరప్ లోని ఫిన్లాండ్ కు చెందిన యువ జంట కూడా వివాహ మహోత్స వంలో పాల్గొన్నారు. మన సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ మహోత్సవంలో దాండియా ఆటపాటలతో సందడి చేశారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు బాట్లు వివాహ పద్ధతి తమకెంతో నచ్చాయని, ఆకట్టుకున్నాయన్నారు. ఇక్కడి వివాహ పద్ధతి తమను మంత్రముగ్ధులను చేసాయని అన్నారు. తమ యొక్క అనుభూతులను ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు.