దౌల్తాబాద్,(విజయక్రాంతి): యువతి యువకుడు ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకోగా.. యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసిన సంఘటన రాయపోల్ మండలం టెంకంపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం... రాయపోల్ మండలం టెంకంపేట గ్రామానికి చెందిన కోరే మల్లేష్ కుమారుడు కోరే నవీన్, నీల స్వామి పెద్ద కూతురు నీల మాధురి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ గురువారం రాత్రి యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇట్టి విషయం నీల స్వామి కుటుంబ సభ్యులకు తెలిసింది.
కోపోద్రిక్తులై యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున మైసని రాజు, మైసని ఆంజనేయులు, మైసని మహేష్, మైసని కిష్టయ్య, మైసని స్వరూప, మైసని చిన్న స్పరూప, మైసని రేణుక వీరు అందరు కలిసి కోరే మల్లేశం ఇంటి మీద కట్టేలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటి పై సిమెంట్ రేకులు, పెంకలు ధ్వంసం చేశారు. మీ కుమారుడిని ఎక్కడ పంపించారో చెప్పాలంటూ ఇంట్లో ఉన్న మల్లేశంపై కూడా దాడి చేశారు. మల్లేశం కుమారుడు నవీన్ ప్రేమ వివాహం చేసుకున్నారని కోపంతో ఇంటిపైన, తనపైన దాడి చేసి రూ. 10 వేల వరకు ఆస్తినష్టం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరే మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఏఎస్ఐ కృష్ణంరాజు తెలిపారు.