బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ బంగారం షాపులో ఘటన
మేడిపల్లి, అక్టోబర్ 25 (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధి లోని ఓ బంగారం షాపులో ఇద్దరు కార్మికులపై పలువురు దాడిచేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఓ బంగారం షాపులో పనిచేసే ఇద్దరు కార్మికులకు దీపావళి సందర్భంగా షాపు యజమాని తన ఇంటిని శుభ్రం చేసే పని అప్పగించాడు.
ఈ క్రమంలో గాజు పగిలి దాని ముక్కలు ఒక కార్మికుడి కాలికి గుచ్చుకోవడంతో రక్తస్రావం జరిగింది. యజమానిని ఫోన్లో సంప్రదించగా దవాఖానకు వెళ్లాలని సూచించాడు. డబ్బులు షాపులో తీసుకోవాలని చెప్పడంతో ఇద్దరు షాపునకు వెళ్లి డబ్బులు అడిగారు. గిరాకీ ఉన్నందున కొద్దిసేపు ఆగమని షాపు యజమానికి సంబంధించిన వారు తెలిపారు.
కొద్దిసేపటి తర్వాత కార్మికులు మరోసారి డబ్బులు అడిగారు. దీంతో కోపంతో ఊగిపోయిన షాపు వారు కార్మికులను బూతులు తిట్టారు. దీంతో వారి మధ్య మాటలు పెరిగి ఘర్షణ నెలకొంది. దీంతో ఆగ్రహానికి గురైన దుకాణం నిర్వాహకులు ఇద్దరిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.