13-02-2025 12:00:00 AM
కొండపాక, ఫిబ్రవరి 12 : గ్రామపంచాయతీ సిబ్బందిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన కొండపాక మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కుక్కునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. కొండపాక గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న గజ్జె నర్సింలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, గ్రామపంచాయతీ ముందు ఉన్న పోస్టర్లు తొలగిస్తున్నారు.
బిజెపి నాయకుని పోస్టర్లు తొలగించడంతో అదే గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్తలు చేన్న హరికిషన్, శ్రీరామ్ మధు అక్కడికి చేరుకొని మా నాయకుని పోస్టర్లు ఎందుకు తొలగిస్తున్నావంటూ, దుర్భాషలాడుతూ వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో దాడికి గురైన బాధితులు వెంటనే కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, బుధవారం గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, కొండపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుడు, సాక్షులను విచారించి వివరాలు సేకరించారు. ఏసీపి మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.